ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం? ఉత్కంఠ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్ తాజా అడుగులు!
- ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్టు గతకొంతకాలంగా వార్తలు
- ఈసారి ట్రంప్ సీరియస్గా ఉన్నట్లు సమాచారం
- ఇరాన్ మళ్లీ డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరించినట్లు వార్తలు
- దాన్ని తిప్పికొట్టేందుకు తప్పని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఈసారి మరింత తీవ్రంగా కమ్ముకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా దాడుల గురించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుత దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికేలా ఒకే ఒక్క భారీ నిర్ణయాత్మక దాడి చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.
దీనిపై శుక్రవారం ఉదయం తన జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, సైనిక పరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ట్రంప్ తన వీకెండ్ ప్లాన్స్ను మార్చుకొని వాషింగ్టన్లోనే ఉండిపోయారు. తన పెద్ద కుమారుడి వివాహ వేడుకకు కూడా వెళ్లకుండా వైట్హౌస్కే పరిమితం కావడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
మరోవైపు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధుల బృందం టెహ్రాన్లో చివరి ప్రయత్నంగా మధ్యవర్తిత్వ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ట్రంప్లో అసహనం పెరుగుతోందని, అమెరికా పంపిన ‘చివరి ప్రతిపాదన’ను తిరస్కరిస్తే సైనిక చర్య తప్పదంటూ ఇరాన్ను ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం వినిపిస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్తో మూడు నెలల పాటు జరిగిన యుద్ధం ముగిసిన కొన్ని వారాల్లోనే ఇరాన్ మళ్లీ తన డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో చర్చలు ఏదో ఒక కొలిక్కి రాకపోతే.. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.